Kim Jong Un : కిమ్ కొత్త అవతారం: టూరిజంపై ఉత్తర కొరియా దృష్టి:నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కనపెట్టి, సూటూ బూటులో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు.
ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త లుక్: ప్రపంచాన్ని భయపెట్టిన కిమ్ ఇప్పుడు టూరిజంపై దృష్టి
నిరంతరం క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించారు. తన ట్రేడ్మార్క్ అయిన మావో తరహా దుస్తులను పక్కనపెట్టి, సూటూ బూటులో కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. ఉత్తర కొరియాలో ఏడేళ్ల పాటు నిర్మించిన భారీ విలాసవంతమైన ‘వోన్సాన్ కల్మా’ తీరప్రాంత రిసార్ట్ను ఆయన గురువారం (జూన్ 26, 2025) ప్రారంభించారు. ఈ వేడుకల్లో కిమ్ తన భార్య రి సోల్ జు, కుమార్తె కిమ్ జు ఏతో కలిసి కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వోన్సాన్ నగరంలోని కల్మా ద్వీపకల్పంలో సుమారు 5 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఈ రిసార్ట్ విస్తరించి ఉంది. దీని నిర్మాణం 2018లో ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ ఆంక్షలు, కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది.
ఎట్టకేలకు పూర్తయిన ఈ రిసార్ట్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు వందలాది సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం ఇందులో 54 హోటళ్లు, ఒక భారీ ఇండోర్, ఔట్డోర్ వాటర్పార్క్, మినీ-గోల్ఫ్ కోర్సు, సినిమా థియేటర్, షాపింగ్ మాల్స్, డజన్ల కొద్దీ రెస్టారెంట్లు, ఐదు బీర్ పబ్లు, రెండు వీడియో గేమ్ ఆర్కేడ్లు ఉన్నాయి. ఈ రిసార్ట్ను దేశం ఈ ఏడాది సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా కిమ్ అభివర్ణించినట్లు అక్కడి మీడియా తెలిపింది.అంతర్జాతీయ ఆంక్షలతో ఆర్థికంగా సతమతమవుతున్న ఉత్తర కొరియా, పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల ప్రభావం లేని అతికొద్ది రంగాల్లో పర్యాటకం ఒకటి కావడంతో, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
ఈ రిసార్ట్ను జులై 1 నుంచి దేశీయ పర్యాటకులకు, జులై 7 నుంచి రష్యన్ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.రిసార్ట్ వెబ్సైట్ సమాచారం ప్రకారం రష్యాకు చెందిన ‘వోస్టోక్ ఇంటూర్’ అనే ట్రావెల్ ఏజెన్సీ ఇప్పటికే వారం రోజుల టూర్ను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను ప్యాంగ్యాంగ్ నుంచి వోన్సాన్కు విమానంలో తీసుకెళ్లి, నాలుగు రాత్రులు ఈ బీచ్ రిసార్ట్లో, ఒక రాత్రి సమీపంలోని మసిక్ర్యొంగ్ స్కీ రిసార్ట్లో బస కల్పిస్తారు.కరోనా కారణంగా 2020లో మూసివేసిన తమ సరిహద్దులను ఉత్తర కొరియా 2023 నుంచి నెమ్మదిగా తెరుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యాటకులపై పూర్తిస్థాయిలో ఆంక్షలు తొలగించనప్పటికీ, రష్యన్ టూరిస్ట్ గ్రూపులను అనుమతిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో అంతర్జాతీయ అథ్లెట్లతో మారథాన్ నిర్వహించడం ద్వారా కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. వోన్సాన్ రిసార్ట్ ప్రారంభం ఈ ప్రయత్నాల్లో ఒక కీలక ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also:Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆర్కే, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సిట్ నోటీసులు!
